w  
               

 

జయదేవ బృందావనం(అష్ట పది -4)
- డా.తాడేపల్లి పతంజలి

 

రాసే హరిమిహ విహిత విలాసం

                                                                                (చిత్రకారుడు శ్రీ బాపుకు ధన్యవాదములతో)

నిన్ను విడిచి వేరే కాంతలతో విహారం చేసేవానిపై ఎందుకే నీకు ప్రేమ? 'అని ఒక చెలికత్తె అడిగితే రాధమ్మ ఈ అష్టపది పాడటం ప్రారంభించింది .

సంచరదధర సుధా  మధుర ధ్వని ముఖరిత మోహన  వంశం

చలిత దృగంచల  చంచల మౌళి కపోల విలోల వతంసం

రాసే హరిమిహ  విహిత విలాసం 

స్మరతి మనో మమ కృత పరిహాసం                  (1)

సంచరత్=కదులుచున్న; అధరసుధా=క్రింది పెదవి అనే అమృతంలో మధుర=మధురమైన ధ్వని=శబ్దముతో ముఖరిత=మోగుచున్న; మోహన=ప్రేమను పంచే; వంశం = పిల్లనగ్రోవి కలవాడు;చలిత= కదులుచున్న; దృగంచల= చూపుల యొక్క కొనలు కలవాడు; చంచల మౌళి = కదులుచున్న కిరీటము కలవాడు ; కపోల = చెక్కిళ్ళలో ; విలోల= కదిలే ; వతంసం= కర్ణ భూషణములు కలవాడు; రాసే=రాస క్రీడా స్థలంలో విహిత విలాసం=లీలలు  చేసిన కృత పరిహాసం=నవ్వులు పంచిన హరిం=శ్రీ కృష్ణుని మమ మనః =నా  మనస్సు;ఇహ=ఈ పొదరింటిలో; స్మరతి=స్మరిస్తోంది;

తాత్పర్యం

సఖీ! అ పిల్లనగ్రోవి మోత వింటున్నావా! ఆయన అధరాలలోని  అమృతపు తియ్యదనాన్ని నింపుకొని,ప్రేమను పంచుతూ  ఆ పిల్లనగ్రోవి మోగుతోంది.అదుగో! ఏ గోప కన్యనో ఎవరినో కండ్ల చివరలనుంచి చూస్తున్నాడు. గమనిస్తున్నావా! స్వామి నాట్యం చేసేటప్పుడు కిరీటం, చెక్కిళ్ళపై కర్ణకుండలాలు అందంగా కదులుతున్నాయి. రాస క్రీడా స్థలంలో లీలలు  చేసిన ,నవ్వులు పంచిన శ్రీ కృష్ణుని  నా  మనస్సు  ఈ పొదరింటిలో  స్మరిస్తోంది

విశేషం:

ఏం చేయమంటావు చెప్పు! నాకు కోపం తెచ్చుకోవాలనే ఉంటుంది. కాని స్వామి ఒక్కసారి అమృతాన్ని నింపిన మురళిని వాయిస్తే ,అందంగా  చూస్తుంటే ఇంతే సంగతులు చిత్తగించవలెను. కోపం ..గీపం  కాదు. నన్ను  నేనే మరచిపోతాను ఆని రాధమ్మ మాటలలోని విశేషం. 

చంద్రక చారు  మయూర శిఖండ మండల వలయిత కేశం

ప్రచుర పురందర ధనురనురంజిత మేదుర ముదిర సువేషం

రాసే హరిమిహ  విహిత విలాసం 

స్మరతి మనో మమ కృత పరిహాసం                  (2) 

చంద్రక = నెమలి కన్నుల చేత ;  చారు= ఒప్పుచున్న   ;      మయూర= నెమళ్ళ యొక్క ;   శిఖండ =పించములయొక్క  ;    మండల=  సమూహాల   చేత ; వలయిత=  చుట్టుకొన్న  ;     కేశం= వెంట్రుకలు కలవాడిని  ; ప్రచుర = వ్యాపించిన  ; పురందరధనుః  = ఇంద్ర ధనుస్సులచేత;  అనురంజిత= అలంకారం చేసిన   ; మేదుర  = నల్లనైన   ;   ముదిర= మేఘంలా ఉన్న ;  సువేషం    =మంచి వేషం కలిగిన ; రాసే=రాస క్రీడా స్థలంలో;విహిత విలాసం=లీలలు  చేసిన ;కృత పరిహాసం=నవ్వులు పంచిన;హరిం=శ్రీ కృష్ణుని మమ మనః =నా  మనస్సు;ఇహ=ఈ పొదరింటిలో; స్మరతి=స్మరిస్తోంది;

తాత్పర్యం

కృష్ణుని తల అందమైన ,రంగురంగుల నెమలి పురులతో చుట్టుకొని ఉంది.ఆ నల్లటి కేశపాశం మేఘాల్లాగా ,చుట్టుకొన్న నెమలిపురులు ఇంద్ర ధనుస్సుల్లాగా ఉన్నాయి.ఈ విధంగా ఉన్న  రాస క్రీడా స్థలంలో లీలలు  చేసిన ,నవ్వులు పంచిన శ్రీ కృష్ణుని  నా  మనస్సు  ఈ పొదరింటిలో  స్మరిస్తోంది;

విశేషం:

పచ్చని ,నల్లని వర్ణాలు కలిగిన చంద్రాకారంలో ఉండే నెమలిపురి కన్నును చంద్రకం అంటారు.

గోపకదంబ  నితంబవతీ ముఖ చుంబనలంబిత లోభం

బంధుజీవ మధురాధర పల్లవ కలిత దరస్మిత శోభం

రాసే హరిమిహ  విహిత విలాసం 

స్మరతి మనో మమ కృత పరిహాసం                  (3) 

గోపకదంబ =గొల్లల సమూహాలకు సంబంధించిన నితంబవతీ=స్త్రీల యొక్క ; ముఖ చుంబన =మోములను ముద్దాడుటలలో; లంబిత=ప్రాప్తించిన; లోభం=అనురాగం కలిగిన; బంధుజీవ=మంకెన  పువ్వులా ;బంధుర=అందమైన మధుర=తీయనైన : అధర పల్లవ=చిగురుటాకు వంటి పెదవులయందు కలిత=కూడుకొన్న; దరస్మిత=మందహాస శోభం=కాంతి కలిగిన; రాసే=రాస క్రీడా స్థలంలో;విహిత విలాసం=లీలలు  చేసిన ;కృత పరిహాసం=నవ్వులు పంచిన;హరిం=శ్రీ కృష్ణుని;మమ మనః =నా  మనస్సు;ఇహ=ఈ పొదరింటిలో; స్మరతి=స్మరిస్తోంది;

తాత్పర్యం

సఖీ! ఈ ఎర్రని మంకెన పుష్పాన్ని చూసినప్పుడల్లా స్వామి వారి అధరం గుర్తుకు వస్తోందే!   కాని ఏంలాభం ! అది గోపికల ముఖ చుంబనంలో మునిగిపోయి ఉంది.అందంగా ఆ పెదవిమీద   ప్రకాశించే  స్వామి మందహాసాన్ని    నా  మనస్సు  ఈ పొదరింటిలో  స్మరిస్తోంది;

విశేషం:

ముఖమంటే ఇక్కడ  పెదవి అనికూడా అర్థం చెప్పుకోవాలి. జయదేవుడు  మంకెన పువ్వును పెదవిపోలికతో సరిపెట్టాడు. అన్నమయ్య ఇంకొంచెం ముందుకు పోయి 'మగువ రతులలోన మంకెన పూవులు పూచె(24-8)'' అన్నాడు. ఇంతకీ ఆ మంకెన పువ్వు ఇలా ఉంటుంది

 

ఇక జయదేవుడి పోలికను,ఆన్నమయ్య పోలికను ఊహించుకోండి 

విపులపులకభుజపల్లవవలయితవల్లవయువతిసహస్రం

కరచరణోరసి మణిగణభూషణ కిరణ విభిన్నతమిస్రం

రాసే హరిమిహ  విహిత విలాసం 

స్మరతి మనో మమ కృత పరిహాసం                  (4) 

విపుల=వెడల్పైన; పులక=నిక్కబొడుచుకొన్న ;వెండ్రుకలు కల ; భుజపల్లవ=చేతులనే పల్లవములచేత ;వలయిత=చుట్టబడిన ;వల్లవయువతి=గొల్ల భామలయొక్క;

సహస్రం=వేయి కలవాడు ;కర=చేతులయందు;చరణ=పాదములయందు;ఉరసి=వక్షస్స్థలమందు ; మణిగణభూషణ=రత్నముల గుంపు కలిగిన ఆభరణముల ;కిరణ= కాంతులచేత ;

విభిన్న=చీల్చబడిన ;తమిస్రం =చీకటి కలిగిన; రాసే=రాస క్రీడా స్థలంలో;విహిత విలాసం=లీలలు  చేసిన ;కృత పరిహాసం=నవ్వులు పంచిన;హరిం=శ్రీ కృష్ణుని;మమ మనః =నా  మనస్సు;ఇహ=ఈ పొదరింటిలో; స్మరతి=స్మరిస్తోంది;

తాత్పర్యం

గోపికలు స్వామిని కౌగిలించే సమయంలో కృష్ణుని చేతుల్లో ,వక్షస్థలంలో ఉన్న రత్న కాంతులు   చుట్టు ఉన్న అంధకారాన్ని చీల్చేస్తున్నాయి .అందంగా ఆ పెదవిమీద   ప్రకాశించే  స్వామి మందహాసాన్ని    నా  మనస్సు  ఈ పొదరింటిలో  స్మరిస్తోంది;

విశేషం

లోకానికి గ్లాని పొందించేది తమిస్రం(=చీకటి) ఆ తమిస్రాన్ని పొగొడుతోంది  స్వామి ఆభరణం  స్వామి గోపికలనే జీవుల అఙ్ఞానపు చీకటిని పోగొట్టేవాడని ఇక్కడ ప్రతీకాత్మకంగా చెప్పబడింది.

జలద పటలచలదిందు వినిందక చందన తిలక లలాటం

పీన పయోధర పరిసర మర్దన నిర్దయ హృదయ  కవాటం

రాసే ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,పరిహాసం                  (5)

 జలద పటల =మేఘాల గుంపులో ;చలదిందు =కదులుతున్న చంద్రుని ;వినిందక =నిందిస్తున్న ;చందన తిలక =గంధం తిలకం కలిగిన ;లలాటం=నుదురు కలిగిన వాడు;

పీన=బలిసిన; పయోధర=స్తనాల;పరిసర మర్దన=సమీపంలో మర్దించటంలో ; నిర్దయ=దయలేని; హృదయ కవాటం= తలుపువంటి గట్టిదైన హృదయం కలిగిన; రాసే=రాస క్రీడా స్థలంలో;విహిత విలాసం=లీలలు  చేసిన ;కృత పరిహాసం=నవ్వులు పంచిన;హరిం=శ్రీ కృష్ణుని;మమ మనః =నా  మనస్సు;ఇహ=ఈ పొదరింటిలో; స్మరతి=స్మరిస్తోంది;

తాత్పర్యం

మేఘాల చాటున ఉన్న చంద్రున్ని చూస్తుంటే   గంధం తిలకంగా పెట్టుకొన్న    కృష్ణయ్య ముఖం గుర్తుకువస్తోందే ! ఇక వాడి హృదయం  ఎంత కఠినమైనదే! గోప కాంతల బలిసిన ,కఠినమైన స్తన పరిసరాలను  తాకి,తాకి హృదయం   కఠినమై ఉంటుంది.అయినా -అందంగా ఆ పెదవిమీద   ప్రకాశించే  స్వామి మందహాసాన్ని    నా  మనస్సు  ఈ పొదరింటిలో  స్మరిస్తోంది;

విశేషం:

 స్వామి వారి తిలకం చంద్రుని ఆకారంలో ఉందని గ్రహించాలి.

మణిమయ మకర మనోహర కుండల మోహిత గండముదారం

పీత వసనమనుగత ముని మనుజ సురాసుర వర పరివారం

రాసే ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,పరిహాసం                  (6)

మణిమయ మకర=రత్నాలతో చేసిన;మనోహర= మొసళ్ళ ఆకారం తో అందంగా ఉన్న ;కుండల = చెవుల అలంకారములతో ;మోహిత =మోహింపబడిన;గండముదారం=చెక్కిళ్ళు కలిగినట్టివాడును;పీత వసనం =పచ్చని వస్త్రము కలిగిన వాడు ;అనుగత=ఆనుసరించిన ; ముని =మునులు;మనుజ =మనుష్యులు ;సురాసుర=దేవతలు,రాక్షసులు మొదలైన ;వర పరివారం=శ్రేష్ఠ  పరిచారకులు కల ;రాసే=రాస క్రీడా స్థలంలో;విహిత విలాసం=లీలలు  చేసిన ;కృత పరిహాసం=నవ్వులు పంచిన;హరిం=శ్రీ కృష్ణుని;మమ మనః =నా  మనస్సు;ఇహ=ఈ పొదరింటిలో; స్మరతి=స్మరిస్తోంది;

తాత్పర్యం

చెలీ! కృష్ణుని చెవులకు పెట్టుకొన్న మనోహర రత్నాభరణాలు చెక్కిళ్ళను మెరిపిస్తున్నాయి.ఆ రత్నాభరణాలు మన్మథుని గుర్తు అయిన మొసలి ఆకారంలో ఉన్నాయి.పచ్చని వస్త్రం ధరించిన స్వామిని ఋషులు ,మనుజులు,దేవతలు,రాక్షసులు పరిచారకుల్లా  అనుసరిస్తున్నారు. అందంగా ఆ పెదవిమీద   ప్రకాశించే  స్వామి మందహాసాన్ని    నా  మనస్సు  ఈ పొదరింటిలో  స్మరిస్తోంది;

విశద కదంబ తలే  మిళితం   కలి కలుష భయం  శమయంతం

మామపి  కిమపి  తరంగదనంగ దృశా  మనసా  రమయంతం

రాసే ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,పరిహాసం                                (7)

విశద కదంబ తలే=నిర్మలమైన కడిమిచెట్ల నీడలో ;మిళితం=చేరిన;కలి కలుష భయం=కలి భయాన్ని;శమయంతం =పోగొట్టే;కిమపి=ఏదో రకంగా ;తరంగత్=చలిస్తున్న

అనంగదృశా మనసా =మన్మథ దృష్టి  గల మనస్సుతో ;మామపి=నన్ను కూడా;రమయంతం=సంతోషపెడుతూ; రాసే=రాస క్రీడా స్థలంలో;విహిత విలాసం=లీలలు  చేసిన ;కృత పరిహాసం=నవ్వులు పంచిన;హరిం=శ్రీ కృష్ణుని;మమ మనః =నా  మనస్సు;ఇహ=ఈ పొదరింటిలో; స్మరతి=స్మరిస్తోంది;

తాత్పర్యం

సఖీ! కదంబ వృక్ష నీడలో చేరిన వాడు, కలి యుగ పాతకాలను పోగొట్టేవాడు, మన్మథ కామ దృష్టితో   నన్ను సంతోష పెట్టే  వవాని యొక్క   అందంగా ఆ పెదవిమీద   ప్రకాశించే  స్వామి మందహాసాన్ని    నా  మనస్సు  ఈ పొదరింటిలో  స్మరిస్తోంది;

విశేషం:

కదంబ వృక్షం (కడిమి చెట్టు) ఆనాదిగా మన సాహిత్యంలో సుప్రసిద్ధం.కదంబవనవాసిని ఆని ఆమ్మను మనం కీర్తిస్తాం. ఇంకా  చాలాచోట్ల కదంబ ప్రసక్తి వస్తుంది.

 

కడిమి చెట్టు

శ్రీజయదేవ భణితమతి సుందర మోహన మధురిపు రూపం

హరి చరణ స్మరణం  ప్రతి సంప్రతి పుణ్యవతామనురూపం

రాసే ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,పరిహాసం                  (8)

అతి సుందర మోహన మధురిపు రూపం=బాగా అందమైన,మోహ కరమైన  కృష్ణుని రూపం వంటి రూపం కలిగిన ; శ్రీజయదేవభణితం=శ్రీజయదేవ కవిచే చెప్పబడిన ఈ గీతం ;సంప్రతి=ఇప్పుడు ;పుణ్యవతాం  =పుణ్య పురుషులకు ;హరి చరణ స్మరణం  ప్రతి=శ్రీ కృష్ణ పాద ధ్యానం గురించి;అనురూపం= యోగ్యమైనది ; రాసే=రాస క్రీడా స్థలంలో;విహిత విలాసం=లీలలు  చేసిన ;కృత పరిహాసం=నవ్వులు పంచిన;హరిం=శ్రీ కృష్ణుని;మమ మనః =నా  మనస్సు;ఇహ=ఈ పొదరింటిలో; స్మరతి=స్మరిస్తోంది;

తాత్పర్యం

శ్రీ కృష్ణ పాద ధ్యాన  స్మరణము  చేయుచూ ,స్వామిని వర్ణించి పరవశించే  ఈ గీతం పుణ్య పురుషులకు యోగ్యమైనది. అందంగా ఆ పెదవిమీద   ప్రకాశించే  స్వామి మందహాసాన్ని    నా  మనస్సు  ఈ పొదరింటిలో  స్మరిస్తోంది;

విశేషం:

ఈ అష్టపదిలో స్మరణమనే భక్తి భావం  శృంగార పద నర్తనలో మన మనస్సులను కట్టి పడేస్తుంది .అర్థం చేసుకొంటూ అపూర్వ మైన ఈ అష్టపదిని  వింటుంటే మనం పోగొట్టుకొన్నదేదో మళ్ళీ మన దగ్గరికి వచ్చిన అనుభూతి కలుగుతుంది .హృదయంలో అ నల్లనయ్య అందెల మోతలు వినబడతాయి. స్వస్తి.

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం